రోహిణి కార్తె ఎండ లకు రోళ్లు పగులుతాయనే నానుడి ఉండేది. రోళ్లు పగలడం ఏమో కానీ రోహిణి కార్తె రాకముందే ఎండలకు కొండ రాళ్లు పగులుతుండటం ఆందోళన కల్గిస్తొంది. కర్నూలు జిల్లా గోనెగుండ్ల గ్రామంలో ఎండ తీవ్రతకు ఓ పెద్ద బండరాయి పగిలిపోయింది. భారీ శబ్దంతో బండ రాయి పగిలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. గోనెగండ్ల ఎస్సీ కాలనీ సమీపంలో నరసప్ప ఆలయ వద్ద ఉన్న బండరాయి నుండి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వెళ్లి పరిశీలించారు. పగిలిన రాయి నుండి పొగతో పాటు చిన్న చిన్న ముక్కలు రాలిపోతుండటాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని స్థానికులు తహశీల్దార్ కార్యాలయానికి తెలియజేశారు.
కొండ చుట్టూ నివాస గృహాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చీలిన కొండరాయి పై మరో రాయి ఉండటంతో అది పడే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఎండకు పగుళ్లు ఇచ్చిన కొండ రాయిని తహశీల్దార్ వేణుగోపాల్ సందర్శించారు. ప్రమాద నివారణకు ముందస్తు చర్యలో భాగంగా కొండ రాళ్ల పక్కన ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తామని తెలిపారు. మైనింగ్ అధికారుల సూచనలు, సలహాలతో కొండరాళ్లను తొలగించే పనులు మొదలు పెడతామని చెప్పారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా భారీ నష్టం జరుగుతుందని, సాంకేతికంగా కొండ రాళ్లలను తొలగించే ప్రయత్నం చేస్తామని తహశీల్దార్ మీడియాకు తెలిపారు.