విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో గల జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. అందులో పని చేస్తున్న 57 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. పరిశ్రమకు ప్రధాన ముడి సరుకు అందుబాటులో లేకపోవడం, ఉత్పత్తులకు మార్కెట్ లో సరైన ధర లేకపోవడంతో ఆర్ధికంగా నష్టపోతున్నట్లు యూనిట్ హెడ్ దినేశ్ శర్మ విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. దాన్ని కంపెనీ వద్ద బోర్డులో పెట్టారు.

జిందాల్ పరిశ్రమను తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, నేతలు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు. యాజమాన్యానికి సహకరించేందుకు సిద్దమని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడాన్ని వారు తప్పుబట్టారు. ఈ చర్యలతో కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, వారి కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోతున్నారు.

మరో పక్క పరిశ్రమ మూసివేతతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమస్యపై యాజమాన్య ప్రతినిధులతో కార్మిక సంఘాలు చర్చలు జరుపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *