ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియర్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హజరై వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఇవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు. ఏపీలో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. సుమారు అరగంటకు పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. వీరితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం వంటి ఘటనలను ఎందుకు నివారించలేకపోయారని ఈసీ వీరిని నిలదీసింది. పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ఈసీ ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరు అంటూ మండిపడింది. కొన్ని వర్గాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల కారణంగానే హింస చెలరేగినట్లు జవహర్ రెడ్డి, హరీశ్ కుమార్ గుప్తా వివరణ ఇచ్చినట్లు తెలుస్తొంది.
పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి దాడులు, అలానే శ్రీకాకుళం నుండి కర్నూలు వరకూ వరుసగా జరిగిన ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసు అధికారుల నిర్లిప్తతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మండిపడ్డారని తెలుస్తొంది. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తగిన విధంగా వినియోగించుకోలేకపోయినట్లు తమకు సమాచారం అందిందని డీజీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.